నేడు.. రేపు కీలకం.. పోటాపోటీగా విచారణ

by Disha Web Desk 4 |
నేడు.. రేపు కీలకం.. పోటాపోటీగా విచారణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ ఘర్షణ దర్యాప్తు సంస్థల రూపంలో రోజుకో మలుపు తిరుగుతున్నది. లిక్కర్ స్కామ్ కేసుతో సీబీఐ, ఐడీ రాష్ట్రంపై కన్నేస్తే మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారంతో 'సిట్' తెరమీదకు వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెకు మద్యం కుంభకోణం కేసులో సీబీఐ నోటీసు జారీ చేస్తే బీజేపీ కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు ఉచ్చు బిగించాలని టీఆర్ఎస్ భావిస్తున్నది. ఇప్పటికే సీఆర్‌పీసీ 41-ఏ కింద బీఎల్ సంతోష్‌కు 'సిట్' నోటీసు జారీచేసింది. కానీ ఆయన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పేరుతో విచారణకు హాజరుకాలేదు. విచారణకు సహకరించాలంటూ బీఎల్ సంతోష్‌కు క్లారిటీ ఇచ్చిన హైకోర్టు గైర్హాజరైతే అరెస్టు చేయవద్దంటూ పోలీసుల్ని ఆదేశించింది.

ఇలాంటి పరిస్థితుల్లో సోమవారం, మంగళవారం ఏం జరగనున్నదనేది ఆసక్తికరంగా మారింది. బీఎల్ సంతోష్ తరఫున హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనున్నది. అరెస్టు చేయవద్దంటూ ఇచ్చిన ఆదేశం గడువు సోమవారంతో ముగియనున్నది. దీంతో మంగళవారం నుంచి 'సిట్' కార్యాచరణ ఏ విధంగా మారుతుందనే ఆసక్తి నెలకొన్నది. బీఎల్ సంతోష్‌తో పాటు కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి తదితరులను కూడా విచారణకు హాజరుకావాల్సిందిగా 'సిట్' గతంలోనే నోటీసులు జారీచేసింది. కానీ వేర్వేరు కారణాలతో వీరు కూడా హాజరుకాలేదు. తుషార్, జగ్గుస్వామి దాఖలు చేసిన వేర్వేరు క్వాష్ పిటిషన్‌లు సైతం సోమవారం హైకోర్టులో విచారణకు రానున్నాయి. హైకోర్టు ఎలాంటి ఆర్డర్ ఇస్తుందనేది కీలకంగా మారింది.

ఇంకోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉన్నదంటూ ఇప్పటికే అరెస్టయినవారి నుంచి వివరాలు అందడంతో ఆమెను ప్రశ్నించడానికి సీబీఐ సిద్ధమవుతున్నది. రెండు రోజుల క్రితం నోటీసులు జారీచేసింది. అవి అందాయంటూ కవిత కూడా ధృవీకరించారు. నగరంలోని ఆమెనివాసంలోనే మంగళవారం సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇదే సమయంలో ఎఫ్ఐఆర్ కాపీని, దీనికి ముందు కేంద్ర హోంశాఖ డైరెక్టర్ ప్రవీణ్ రాసిన ఫిర్యాదు ప్రతిని అందించాల్సిందిగా సీబీఐ డిప్యూటీ ఎస్పీకి కవిత లేఖ రాశారు. అవి అందిన తర్వాత విచారణకు తేదీని ఖరారు చేయవచ్చంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కవితకు సీబీఐ నోటీసులు రావడంతోనే ఆమెకు మద్దతుగా పార్టీ శ్రేణులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు సంఘీభావం ప్రకటించి అండగా ఉంటామని మద్దతు పలికారు.

ఎమ్మెల్సీ కవిత కోరినట్లుగా ఆ ప్రతులను సీబీఐ ఇవ్వకపోతే ఆమె విచారణకు హాజరుకారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీబీఐ నుంచి నోటీసులు అందుకున్న వెంటనే ప్రగతి భవన్ వెళ్ళి తండ్రి కేసీఆర్‌ను కలిసి చర్చలు జరిపారు. వ్యవహారించాల్సిన తీరుపైనా, వ్యూహంపైనా న్యాయనిపుణులతోనూ సీఎం కేసీఆర్ సంప్రదింపులు జరిపి అభిప్రాయాలను తీసుకున్నారు. ఇకపైన లీగల్‌గా ప్రొసీడ్ కావడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపైనా చర్చలు జరిగాయి. తొలిసారిగా సీబీఐ విచారణకు హాజరుకానుండడం గమనార్హం. ముఖ్యమంత్రి కుటుంబమంతా అవినీతిలో మునిగిపోయింది.., తప్పు చేయనప్పుడు విచారణకు హాజరుకావడానికి భయమెందుకు?.. ఆమె స్కామ్‌కు పాల్పడ్డారన్నది ముమ్మాటికీ నిజం.. ఇలాంటి కామెంట్లు బీజేపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి.

బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల మధ్య ఎత్తుగడలుగా మారాయి. బీజేపీకి చెందిన బీఎల్ సంతోష్ వర్సెస్ టీఆర్ఎస్‌కు చెందిన కల్వకుంట్ల కవిత తరహాలో మారిపోయాయి. లిక్కర్ స్కామ్ వర్సెస్ మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఇష్యూగా తెరమీదకు వచ్చాయి. పోటాపోటీగా జరుగుతున్న ఈ దర్యాప్తు ప్రక్రియ ఒక్కో రోజు ఒక్కో సంచలనంగా మారుతున్నది. ఈ రెండు రోజుల పాటు జరిగే పరిణామాలపైనే రెండు పార్టీల నేతల దృష్టి కేంద్రీకృతమైంది. ఈ రెండు రోజుల్లో జరిగే పరిణామాలు ఉత్కంఠగా మారుతున్నాయి.

Read more:

ఎమ్మెల్యేల ఓట్ల రాజకీయం.. దళితుల మధ్య 'బంధు' చిచ్చు!


Next Story

Most Viewed